
- నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో విషాదం
అచ్చంపేట, వెలుగు : నీటి కుంటలో పడి అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మన్పల్లికి చెందిన కుంభం ధరణి, సుధాకర్ దంపతులకు అశ్విత్కుమార్ (7), చేతన్ (6) కుమారులు ఉన్నారు. సోమవారం చిన్నారులిద్దరినీ ఇంటి వద్దే వదిలి.. దంపతులు విత్తనాలు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు.
మధ్యాహ్నం చిన్నారులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఓ రైతుకు చెందిన పొలంలో నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన కుంట వద్దకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. చిన్నారుల కేకలు వినిపించడంతో సమీపంలో ఉన్న రైతులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయి కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్దాపూర్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.